హుజూరాబాద్ బై పోల్స్: ఈటలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నేతలు

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ కొనసాగుతోంది. హుజూరాబాద్ లో మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా, బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

పోలింగ్ జరుగుతున్న సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారని, ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. పైగా, నియోజకవర్గ ప్రజలు తమవైపే ఉన్నారని, ప్రజల ఆశీస్సులు తనకే ఉన్నాయని ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యాఖ్యానించారని వారు ఆరోపించారు. ఈటల భార్య అసత్య ప్రచారం చేస్తున్నారని కూడా వారు ఎన్నికల సంఘానికి నివేదించారు. ఈటల దంపతులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కాగా, తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ స్పందిస్తూ... హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటింగ్ నేపథ్యంలో ఇప్పటివరకు 88 ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. ఆయా ఫిర్యాదులపై ఎన్నికల పరిశీలకులు వివరాలు సేకరిస్తున్నారని, నిజానిజాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.

TRS Leaders
Eatala Rajendar
SEC
Huzurabad
By Polls
Telangana

More Telugu News